సిటీబ్యూరో, మే 20(నమస్తే తెలంగాణ) : బ్లాక్ ఫంగస్కు ఉపయోగించే ఇంజక్షన్ను బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 5 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. పంజాగుట్టకు చెందిన ఫల్కారం కాశయ్య డెకరేషన్ పనులు చేస్తుంటాడు. ప్రైవేట్ ఉద్యోగం చేసే వినోద్కుమార్ నాయక్, కృష్ణనగర్లో ఎంఎన్ఆర్ ఫార్మసీ పేరుతో మెడికల్ షాప్ నిర్వహించే మహ్మద్ ఖాజా నిజామ్తో ముఠా ఏర్పాటు చేశాడు. బ్లాక్ ఫంగస్ వ్యాధికి ఉపయోగించే అంఫోటెరీసిన్ బీ ఇంజక్షన్కు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో వాటిని బ్లాక్లో రూ. 50 వేలకు విక్రయించాలని పథకం వేశారు. పోచమ్మబస్తీ ప్రాంతంలోని ఢిల్లీ స్వీట్ హౌస్ సమీపంలో అవసరమైన వారికి రూ. 50 వేలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఐదు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
రెమ్డిసివర్ విక్రయిస్తూ..
చార్మినార్, మే 20 : బ్లాక్లో రెమ్డిసివర్ మందులు విక్రయిస్తున్న నలుగురిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హుస్సేనీ ఆలంకు చెందిన మహ్మద్ అక్బర్ఖాన్, మహ్మద్ ముజాఫర్, మహ్మద్ హకీముద్దీన్, సయ్యద్ సదీఉద్దీన్లను అరెస్టు చేసి.. వారి నుంచి రెమ్డిసివర్ ఇంజక్షన్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపారు.