తొగుట, మార్చి 31: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుకు నిరసన సెగ తగిలింది. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో రైతు బజార్ను ప్రారంభించడానికి వచ్చిన రఘునందన్రావును స్థానికులు ఘెరావ్ చేశారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా 50 డబుల్ బెడ్రూం ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలపై ప్లకార్డులతో నిరసన తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిస్తే గుడికందుల అభివృద్ధికి తెస్తానన్న నిధులేవని నిలదీశారు.
వందలాది మంది గ్రామస్థులు ఒక్కసారిగా నిరసన తెలుపడంతో ఎమ్మెల్యే రఘునందన్రావు బిత్తరపోయారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. పెట్రో, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మహిళలు ఖాళీ సిలిండర్లతో 2 గంటలపాటు మండుటెండలో బైఠాయించారు. గ్రామస్థులు, టీఆర్ఎస్ నాయకులపైకి బీజేపీ నాయకులు దూసుకురావడంతో స్వల్ప తోపులాట జరిగింది. 50 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన తర్వాతే గ్రామంలోకి రావాలని డిమాండ్ చేశారు. నిరసనల మధ్య రైతుబజార్ను ప్రారంభిస్తుండగా ఎమ్మెల్యే ఎదురుగా మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిలదీశారు. సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నదని, బీజేపీ సర్కారుకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఈ సమయంలో హరికృష్ణారెడ్డిని బయటకు పంపించాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించడంతో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో ప్రసంగించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు. అనంతరం టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పులిరాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు బాసిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య, సర్పంచ్లు సిరినేని గోవర్ధన్రెడ్డి, గంగనిగల్ల మల్లయ్య, తొయేటి ఎల్లం, ఎంపీటీసీ కే కవిత, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.