వరంగల్ అర్బన్ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేస్తుంది. ప్రధాని
మోదీ దేశాన్ని మూర్ఖంగా పాలిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.
వరంగల్ జిల్లా పద్మ నాయక వెలమ సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం హన్మకొండలోని అభిరామ్ గార్డెన్ లో ఆదివారం జరిగింది.
ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై మాట్లాడారు.
సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు.
నల్ల ధనం వెలికి తీస్తామన్న బీజీపీ వెలికి తీసిందా అని ప్రశ్నించారు? 15 లక్షలు జీరో అకౌంట్లో వేశార?
ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఇచ్చారా?
ఏడేండ్లుగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ముందు ఇచ్చాక బీజేపీ మాట్లాడాలన్నారు.
రైల్యే ప్లాట్ ఫామ్ మీద చాయ్ అమ్మిన మోదీ.. ఇపుడు రైళ్లను, ఆ ప్లాట్ ఫామ్స్ని కూడా అమ్ముతున్నారని మండిపడ్డారు.
దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం ఆంధ్రాకు 7 కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు?
రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.
ప్రజలు బీజీపే, టీఆర్ఎస్ పనితీరును గమనించాలన్నారు. వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, డైరెక్టర్ జగన్ మోహన్ రావు, తదితరలు పాల్గొన్నారు.