ముంబై: బెంగాల్ లో ఇటీవల అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ హింసాకాండకు పాల్పడుతుందంటూ ఈనెల 5న బీజేపీ తలపెట్టిన దేశవ్యాప్త నిరసన ధర్నా కార్యక్రమంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా ర్యాలీలు నిర్వహించిందని బీజేపీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ధర్నా కార్యక్రమం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేపడుతామని బీజేపీ అంటున్నది. ఈ హామీని శివసేన ఎంపి ప్రియాంక ఎద్దేవా చేశారు. దేశంలో కరోనాకు కరువొచ్చిందనా? అందుకే ఈ ధర్నాలు తలపెట్టారా? అని ఆమె ట్విట్టర్లో మండిపడ్డారు. కరోనా రెండో విడత విజృంభించి కల్లోలం సృష్టిస్తున్న వేళ ఈ ధర్నా కార్యక్రమం అవసరమా అని ఆమె దుయ్యబట్టారు. కోరనా వ్యాప్తి చేయాలంటే ధర్నాలు తప్పవు కదా అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.