న్యూఢిల్లీ, నవంబర్ 27: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే బిల్లును కేంద్రప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే ఈ బిల్లను వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సభముందు ఉంచనున్నారు. ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్-2020, ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) యాక్ట్-2020, ది ఎసెన్షియల్ కమొడిటీస్ (అమెండ్మెంట్) యాక్ట్-2020లను ఈ బిల్లు ద్వారా రద్దు చేయనున్నారు. ఏడాదికాలంగా రైతులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో ఈ చట్టాలను రద్దుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
రైతులు ఇంటికి తిరిగి వెళ్లాలి
పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నేరంగా పరిగణించకూడదన్న రైతు సంఘాల డిమాండును అంగీకరించామని, ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. శనివారం ఆయన ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత కూడా రైతులు ఆందోళనలు కొనసాగించడంలో అర్థం లేదని అన్నారు. రైతులు తమ ఆందోళనలను వెంటనే ఆపేసి ఇంటికి వెళ్లిపోవాలని కోరారు. ఎంఎస్పీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా రూపొందించడంపై చర్చించేందుకు ఒక కమిటీని నియమిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటుందని, ఈ కమిటీ ఏర్పాటుతో రైతుల ఎంఎస్పీ డిమాండు కూడా నెరవేరిందని తోమర్ చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ మార్చ్ రద్దు: ఎస్కేఎం
ఈనెల 29న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ను రద్దు చేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో ఎస్కేఎం నిర్ణయం తీసుకుంది. కొత్త సాగు చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై వచ్చే నెల 4న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఎస్కేఎం నేత దర్శన్పాల్ మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, అమరులైన రైతుల స్మారక నిర్మాణం కోసం భూమి కేటాయింపు, మంత్రివర్గం నుంచి అజయ్మిశ్రా తొలగింపుతో పాటు పలు ఇతర డిమాండ్లపై ప్రధాని మోదీకి రాసిన లేఖకు సర్కార్ నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.