Indiramma Houses : మున్సిపల్ ఎన్నిలకు ముందు ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టి వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. సంబంధించిన బిల్లులను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1,072 మంది లబ్దిదారులకు సంబంధించిన రూ.12.17 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు.
ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఎల్-3 కేటగిరీలోని లబ్ధిదారుల బిల్లుల చెల్లింపులఅంశాన్ని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇంటిని నిర్మించుకుంటున్న లబ్దిదారుల్లో ఎల్-3 కేటగీరీలోని వారికి కొద్ది కాలంగా బిల్లులు నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఇండ్ల బిల్లు చెల్లింపుల ప్రక్రియలో నిశిత పరిశీలనలో లబ్ధిదారులు ఆర్సీసి అద్దె ఇండ్లలో నివస్తుండడం, గతంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిపొంది ఉండడం.. వంటి కారణాల వల్ల బిల్లులను విడుదల చేయలేదు.ఈ అంశాన్ని పరిశీలించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో సొంత ఇంటి వసతి లేక ఆర్ సిసి ఇండ్లలో అద్దెకు ఉంటూ.. ప్రస్తుతం ఇండ్లు కట్టుకుంటున్న వారితోపాటు, పాత ఇందిరమ్మ పథకంలో బేస్మెంట్ పనుల వరకే లబ్ధి పొందన వారికి బిల్లులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ కేటగిరీలోని వారికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి సమగ్రమైన నివేదికలు తెప్పించారు. ఆ నివేదికలను అనుసరించి అర్హులైన 1072 మందికి బిల్లులను విడుదల చేస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.