న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్లో విలీనం విషయంలో వివాదాంలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ అనుబంధ నెట్వర్క్ బిగ్బజార్ గురువారం ఇన్స్టంట్ హోమ్ డెలీవరీ సేవలను ప్రారంభించింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను కేవలం రెండు గంటలలోనే వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు బిగ్బజార్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాదు శరవేగంగా ఇతర రిటైల్ నెట్వర్క్ సంస్థలతో పోటీగా వినియోగదారులకు సేవలందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నది బిగ్ బజార్.
ఫ్యాషన్, ఫుడ్, ఎఫ్ఎంసీజీ ఇలా గృహావసరాలకు సంబంధించిన వస్తువులను దగ్గర్లోని స్టోర్ల నుంచి అందజేస్తామని తెలిపింది. యూజర్లు తమ మొబైల్ యాప్ లేదా పోర్టల్ నుంచి ఆర్డర్ చేయొచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)తో సహా ముంబై, బెంగళూరు నగరాల్లో తొలి విడతగా బిగ్ బజార్ ఈ సేవలను ప్రారంభించింది.
రెండవ దశలో రాబోయే 45 రోజుల్లో ఈ సేవలను 21 నగరాలకు విస్తరించాలని ప్రణాళికగా పెట్టుకున్నట్లు బిగ్ బజార్ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ గ్రూప్ ప్రెసిడెంట్ కమల్దీప్ సింగ్ తెలిపారు. వచ్చే ఐదారు నెలల్లో అన్ని బిగ్ బజార్ స్టోర్ల నుంచి ఈ సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
వచ్చే మూడు నెలల్లో రోజుకు లక్ష ఆర్డర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కమల్దీప్ సింగ్ తెలిపారు. కనీసం రూ.500 కొనుగోలుపై ఈ సేవలు అందనున్నాయి. రూ.1000 వరకు వస్తువుల కొనుగోలుపై రూ.49 డెలివరీ ఛార్జీ వర్తిస్తుందని, ఆపై కొనుగోళ్లకు ఉచితంగా డెలీవరీ చేస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం బిగ్ బజార్కు 150 నగరాల్లో 280 స్టోర్లు ఉన్నాయి.