‘భీమ్లానాయక్’ మాతృక అయిన మలయాళీ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మొత్తం కోషియమ్ పాత్ర దృష్టికోణం నుంచి చెప్పబడింది. దానిని తెలుగులో భీమ్లానాయక్ వైపు నుంచి ఎలా తీసుకురావాలి? రెండు ప్రధాన పాత్రల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనే అంశం మీదనే స్క్రిప్ట్దశలో ఎక్కువగా చర్చ జరిగింది.’ అని అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. శుక్రవారం విడుదలైన ‘భీమ్లానాయక్’ చిత్రానికి ఆయన స్క్రీన్ప్లే, సంభాషణలు అందించిన విషయం తెలిసిందే. పవన్కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శనివారం హైదరాబాద్లో థాంక్స్మీట్ జరిగింది.
‘భీమ్లానాయక్ అడవికి సెల్యూట్ చేసే సన్నివేశంతో సినిమాను ఆరంభించాం. ఆయన పాత్ర అడవితో మమేకమై చివరిదాకా అక్కడి ఉద్వేగాలతో ప్రయాణం సాగిస్తుందని చూపించాం. భీమ్లానాయక్ తత్వాన్ని తెలియజేసేలా ఓ కవితతో పాత్రను పరిచయం చేశాం. పవన్కల్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన అభిమానులు కోరుకునే అంశాలన్నింటిని కథలో తీసుకొచ్చాం. రెండు పాత్రలకు సమప్రాధాన్యతనిస్తూ బ్యాలెన్స్ చేశాం. భారతీయ సినిమాలో కొత్తతరం నటీనటులు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. 80, 90 దశకం తారలతో పోల్చితే నేటితరం నటీనటులు సినిమాను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. కేవలం డైలాగులు గుర్తుపెట్టుకొని నటించడం మాత్రమే కాకుండా అంతకుమించిన పరిణితితో సినిమా కళ గురించి ఆలోచిస్తున్నారు. దర్శకుడు సాగర్ కె చంద్ర కథను గొప్పగా అర్థం చేసుకొని తెరపై ఆవిష్కరించారు. అతనికి, నిర్మాతకు మధ్య మేమంతా ఓ వారధిలా ఉంటూ సాగర్ కోరుకున్నవన్నీ సమకూర్చిపెట్టాం. సాగర్ ఇచ్చిన ఐడియా ప్రకారమే మొగిలయ్యతో సినిమాలో పాట పాడించాం. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషాన్నిచ్చింది. ఇక ఈ మధ్య తమన్ సంగీతంతోనే మాట్లాడుతున్నాడు. కథ చెప్పగానే అద్భుతమైన బాణీలతో ముందుకొచ్చాడు’ అని త్రివిక్రమ్ చెప్పారు. సాగర్ కె చంద్ర మాట్లాడుతూ ‘బ్లాక్బస్టర్ హిట్ అంటూ అన్ని కేంద్రాల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్గారు వెన్నెముకలా నిలిచారు. మేమంతా పువ్వులమైతే..వాటిని కలిపి అందమైన హారంలా మలిచింది త్రివిక్రమ్గారే. ఆయన దగ్గర పనిచేయడం వల్ల ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ “భీమ్లానాయక్’ ఓ దావానలం. ఆ ఫైర్ను ఎవరూ ఆపలేరు. త్రివిక్రమ్, పవన్కల్యాణ్ కలయికలో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఈ సినిమాతో నెరవేరింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయితలు రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్, కథానాయిక సంయుక్త మీనన్, నటి ప్రియాంక, కొరియోగ్రాఫర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.