హైదరాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్లో పాల్గొంటున్న ఆరోగ్య కార్యకర్తలకు భారత్ బయోటెక్ కంపెనీ కీలక సూచనలు చేసింది. 15-18 సంవత్సరాల పిల్లలకు కొవాగ్జిన్ టీకా కాకుండా.. ఇతర టీకాలను ఇస్తున్నట్లు సమాచారం ఉందని, ఈ విషమంలో ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు ఇచ్చేందుకు కొవాగ్జిన్ టీకానే ఆమోదం పొందిందనే విషయాన్ని గుర్తు చేసింది.
దేశంలో పిల్లల టీకాకు సంబంధించి కొవాగ్జిన్కే అనుమతి ఉందని కంపెనీ స్పష్టం చేసింది. పిల్లలకు వ్యాక్సిన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, కొవాగ్జిన్ టీకాను వేయాలని మాత్రమే సూచించింది. ఇదిలా ఉండగా.. టీకా డ్రైవ్ ప్రారంభమై దాదాపు 15 రోజులు కాగా.. ఇప్పటి వరకు 15-18 ఏజ్ గ్రూప్లో 50శాతం మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.