న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు నిరసన రైతు సంఘాలు పిలుపునిచ్చిన ‘భారత్ బంద్’లో భాగంగా పంజాబ్, హర్యానా వ్యాప్తంగా 32 చోట్ల నిరసన కారులు రైల్వేట్రాక్లపై బైఠాయించారు. దీంతో ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్పూర్ పరిధిలో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిరసన కారణంగా నాలుగు శతాబ్ది రైళ్లు రద్దు చేసినట్లు ఉత్తర రైల్వే ప్రతినిధి దీపక్కుమార్ తెలిపారు. ఢిల్లీ సరిహద్దులైన సింగు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేపట్టి నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ పాటించాలని కోరింది.
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయడంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీని కోరుతూ రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. దిల్లీ-యూపీ సరిహద్దు ఘజియాబాద్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతల ఆధ్వర్యంలో సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. బంద్లో భాగంగా ఘాజీపుర్ సరిహద్దు వద్ద అన్నదాతలు పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. అంబాలా షాహ్పూర్లో రైతులు రైల్వేట్రాక్పై బైఠాయించారు. మరికొందరు రైతులు జీటీ రోడ్డును దిగ్బంధించారు.