ఖమ్మం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణ అయోధ్యాపురిగా పేరుగాంచిన భద్రగిరిలో పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు రాజాధిరాజుగా దర్శనమిచ్చాడు. స్వర్ణ ఛత్రం, పసిడి పాదుక, రాజదండం, రాజముద్ర, వజ్రకిరీటాలతో స్వర్ణ సింహాసనంపై కొలువుదీరిన జగదాభిరాముడు రారాజుగా దర్శనమివ్వడంతో భక్తుల జయజయధ్వానాలతో మిథిలా సామ్రాజ్యం (స్టేడియం) మార్మోగింది. భద్రాద్రి రాముడికి మహా పట్టాభిషేకం గురువారం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానం వైదిక సిబ్బంది గోదావరి జలాలతో తీర్థప్రోక్షణ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం జరిగిన మరుసటి రోజు శ్రీరాముడికి మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
బుధవారం జరిగిన కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరై స్వామివారు, సీతమ్మతల్లికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మహా పట్టాభిషేకానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరై రామయ్యకు పట్టువస్ర్తాలను సమర్పించారు. గవర్నర్కు భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఈవో రమాదేవి ఘనస్వాగతం పలికారు. అర్చకులు దేవస్థానం తరఫున శేషవస్త్రాలు, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్థానాచార్యులు స్థలశాయి శ్రీరామ మహా పట్టాభిషేక విశిష్టతను భక్తులకు వివరించారు. తొలుత శ్రీరామ బంగారు పాదుకలు, అనంతరం రాజదండం, రాజముద్రిక, భక్తరామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతమ్మకు, శ్రీరామ మాడ లక్ష్మణస్వామికి, తామరం, బంగారు ఛత్రం, రాజఖడ్గం, సామ్రాట్ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేశారు.