రెండు మూడు రోజుల్లో ప్రారంభించే అవకాశం
అభివృద్ధి పనుల పరిశీలనలో మంత్రి పువ్వాడ
ఖమ్మం, మార్చి 27: ఖమ్మంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ త్వరలోనే ప్రారంభిస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. నగరంలోని నూతన ఆర్టీసీ బస్టాండ్, టేకులపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్లు, మున్నేరు వైకుంఠధామం, మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు చెప్పారు. ఐటీ హబ్ రెడో దశ నిర్మాణపు పనులకు, శ్రీశ్రీ రోడ్డు నుంచి నూతన కలెక్టరేట్ వరకు ఫోర్లైన్ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నగరంలోని అభివృద్ధి పనులను ఈ నెల 29న ప్రారంభించుకునేందుకు నిర్ణయించుకున్నప్పటికీ హోలీ పండుగ నేపథ్యంలో కార్యక్రమాలు వాయిదా వేశామన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. నగరంలోని టేకులపల్లిలో పేదల కోసం నిర్మించిన 1104 డబుల్ బెడ్రూం ఇళ్లు, మోడ్రన్ ఆర్టీసీ బస్టాండ్, మున్నేరు వైకుంఠధామం పనుల గురించి బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ, విద్యుత్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులతో ముగింపు పనులపై మంత్రి సమీక్షించారు. మిగిలిన పనులను రెండు రోజుల్లో పూర్తి చేసి అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ బస్టాండ్ పనులను నిరంతరాయంగా కొనసాగించి ఈ నెల 29లోగా ఆర్టీసీ అధికారులకు అప్పగించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్టీసీ సీఈఏ రాంప్రసాద్, ఈఈ సత్యనారాయణ, డీఈకే భాస్కర్, ఆర్టీసీ ఆర్ఎం సాల్మన్, విద్యుత్ ఎస్ఈ రమేశ్, డీఈ రాములు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ పాల్గొన్నారు.