హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘మీకు కేబీసీ వాట్సాప్ లాటరీ తగిలింది. లక్కీడ్రా డబ్బులు రూ.25 లక్షలు పొందడానికి, మీకు వాట్సాప్లో వచ్చిన టికెట్ నంబర్ను, దానితోపాటే పంపిన ఫోన్ నంబర్కు కాల్ చేసి చెప్పండి..’ అంటూ ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు పాకిస్థాన్కు చెందిన +92 కోడ్ నంబర్తో ఫోన్లు చేస్తున్నారు. ఇలా ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నాడు. తాను వాట్సాప్ సంస్థ ఇండియా ఎగ్జిక్యూటివ్ కస్టమర్ కేర్ అధికారినని, న్యూఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాని పరిచయం చేసుకొంటున్నాడు. భారత్, నేపాల్, సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలకు చెందిన పౌరుల ఫోన్ నంబర్లను కలిపి డ్రా తీశామని, మీ వాట్సాప్ నంబర్ లక్కీ విన్నర్గా నిలిచిందని నమ్మిస్తున్నారు.
మీకు లాటరీ డబ్బు చెల్లించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై కార్యాలయం అధికారి మీ ఫోన్ కోసం వేచి చూస్తున్నాడని నమ్మబలుకుతారు. మాటలతో బురిడీ కొట్టించి, రూ.25 లక్షల ఆశ చూపించి, మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి కాల్స్ను అసలు నమ్మొద్దని సైబర్క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫోన్లను పాకిస్థాన్కు చెందిన సైబర్నేరగాళ్లు చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన సైబర్ నేర ముఠాలు పాకిస్థాన్ నుంచి సిమ్కార్డులు తెప్పించుకొని, ఇలాంటి మోసాలకు తెగబడుతున్న విషయం ఇటీవల కొన్ని కేసుల్లో వెల్లడయ్యింది.