హైదరాబాద్, జూన్ 24 (నమస్తేతెలంగాణ) : ‘జూపల్లి కృష్ణారావు అడ్డగోలు మాటలు కాదు..చిత్తశుద్ధి ఉంటే మొన్న అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో హరీశ్రావు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పు..’అంటూ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తికాలేదని, బోనస్ను బోగస్ చేశారని హరీశ్రా వు చేసిన ఆరోపణలు నిజమని చెప్పారు. కాదని భావిస్తే చర్చకు సిద్ధమా? అని నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత అభిలాశ్ రంగినేనితో కలిసి బీరం విలేకరులతో మాట్లాడారు.
అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి ఆచరణలో విఫలమయ్యారని విమర్శించారు. 2లక్షల పైచిలుకు ఉన్నవారు వడ్డీలు కడితే మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని దుయ్యబట్టారు. సహకార బ్యాంకులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయలేదని, కొల్లాపూర్ పెంట్లపల్లి సొసైటీనే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. సన్నవడ్లకు రెండుసార్లు బోనస్ ఎగ్గొట్టారని ఆరోపించారు. కానీ జూపల్లి మాత్రం కాకిలెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎగ్గొట్టిన బోనస్, రైతు భరోసాను ఇప్పించాలని బీరం డిమాండ్ చేశారు.
ఊసరవెల్లులు సైతం సిగ్గుపడేలా పార్టీలు మారడం జూపల్లికి అలవాటేనని బీరం దెప్పిపొడిచారు. నాడు రేవంత్రెడ్డిని దూషించిన జూపల్లి.. ఇప్పుడు కేసీఆర్, హరీశ్రావును దుర్భాషలాడడం శోచనీయమన్నారు. నాడు బీఆర్ఎస్లో పదవులు అనుభవించి ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ నాశనమైందని విమర్శలకు దిగడం దుర్మార్గమన్నారు.