న్యూఢిల్లీ : బాణాసంచా తయారీదారుల తీరును సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రీన్ క్రాకర్ల ముసుగులో నిషేధిత వస్తువులను పటాకుల తయారీలో వినియోగిస్తున్నారని పేర్కొంది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ పటాకుల తయారీదారులో నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. జస్టిస్ ఎంఆర్ షా, ఏఎస్ బోపన్న ధర్మాసనం పిటిషన్ను స్పందిస్తూ.. గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
‘జాయింట్ క్రాకర్స్ను నిషేధించాం. కానీ, ఏ వేడుకకు వెళ్లినా అవే కనిపిస్తాయి. మార్కెట్లో అందుబాటులో ఉంటాయి’ అని ధర్మాసనం పేర్కొంది. తయారీదారులు బేరియం ఉప్పు నిర్వహిస్తూనే ఉన్నారని వెల్లడించిన ఇటీవలి సీబీఐ నివేదికను ఉదహరించిన కోర్టు.. ‘వేడుకల పట్ల మేం విముఖంగా లేము. కానీ, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి మనం సంబురాలు చేసుకోలేం’ అని పేర్కొంది. పటాకుల తయారీదారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే.. ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే చేస్తున్నట్లు వాదించారు.
పరిశ్రమపై దాదాపు ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఇప్పటివరకు శివకాశికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ‘తాము జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడం ప్రధాన సమస్య’ అని పేర్కొంది. ఈ సందర్భంగా సీబీఐ నివేదికకు ప్రతిస్పందనగా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ల కాపీలను మార్పిడి చేసుకోవాలని ఆదేశిస్తూ కేసును ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.