న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. రూ.5వేల వరకు చెల్లింపుల కోసం సరికొత్త వేరబుల్ ఉత్పత్తులను సోమవారం పరిచయం చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో బీవోబీ వరల్డ్ వేవ్ ద్వారా ఈ వేరబుల్ ప్రొడక్ట్స్ను బ్యాంక్ తెస్తున్నది. వచ్చే నెల నుంచి బ్యాంక్ కస్టమర్లకు ఇవి అందుబాటులోకి రావచ్చు. వీటి కోసం అప్పట్నుంచే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. కాగా, గ్యాడ్జెట్స్, ఉంగరాలు, వాచీల వంటి వాటికి బీవోబీ వేరబుల్ ప్రొడక్ట్స్ను అటాచ్ చేసుకోవాలి. దీంతో షాపింగ్ సమయాల్లో పీవోఎస్ మెషీన్లపై ఎటువంటి పిన్ నంబర్ లేకుండానే రూ.5వేల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే అంతకుమించిన పేమెంట్స్కు పిన్ తప్పనిసరి.
మరోవైపు సరళతరమైన ఈ-కామర్స్ లావాదేవీల కోసం ఓ డమ్మీ ప్లాస్టిక్ కార్డునూ కస్టమర్లకు బ్యాంక్ అందించనున్నది. ఇదిలావుంటే ఈ డివైస్లతో వినియోగదారులు తమ ఆక్సిజన్ స్థాయిలను, శరీర ఉష్ణోగ్రతలను, హృదయ స్పందనలను, రక్తపోటును కూడా చూసుకోవచ్చు. అలాగే పర్సనల్ హెల్త్ కోచ్, డాక్టర్ టెలీ-కన్సల్టేషన్, ఇంటరాక్టివ్ వీడియో కోచింగ్లతో ఓ 3 నెలల ఉచిత వెల్నెస్ ప్యాకేజీని కూడా ఈ ప్రొడక్ట్స్తో బీవోబీ తమ కస్టమర్లకు అందిస్తున్నది.