ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదిరిపోయే బోణీ కొట్టింది. పంజాబ్తో గత మ్యాచ్లో ఓటమి ఎదుర్కొన్న ఆర్సీబీ కోల్కతాకు కళ్లెం వేసింది. హసరంగ డిసిల్వా స్పిన్ మాయాజాలంతో కోల్కతా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రస్సెల్ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు బ్యాటింగ్ పడుతూ లేస్తూ సాగింది. టాపార్డర్ విఫలమైనా.. రూథర్ఫోర్డ్, షాబాజ్ రాణింపుతో ఆఖరి ఓవర్లో విజయాన్ని అందుకుంది.
నేవి ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల ఖాతా తెరిచింది. కోల్కతా నైట్రైడర్స్తో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన స్వల్ప స్కోరింగ్ మ్యాచ్లో బెంగళూరు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్కతా నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్సీబీ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. టిమ్సౌథీ(3/20), ఉమేశ్ యాదవ్(2/16) ధాటికి 17 పరుగులకే మూడు కీలక వికెట్లు డుప్లెసిస్(5), అనూజ్ రావత్(0), కోహ్లీ(12) కోల్పోయింది. ఈ దశలో రూథర్ఫోర్డ్(28), షాబాజ్ అహ్మద్(27), డేవిడ్ విల్లే(18) బ్యాటు ఝులిపించారు.
కోల్కతా బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. ముఖ్యంగా రూథర్ఫోర్డ్, విల్లే మూడో వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లక్ష్యం సమీపిస్తున్న సమయంలో వికెట్లు చేజార్చుకున్న బెంగళూరును దినేశ్ కార్తీక్(14 నాటౌట్), హర్షల్ పటేల్(10 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఆఖరి ఓవర్లో విజయానికి ఏడు పరుగులు అవసరమైన సమయంలో రస్సెల్ను లక్ష్యంగా చేసుకున్న కార్తీక్ వరుసగా బంతుల్లో సిక్స్, ఫోర్తో జట్టును గెలుపు సంబురాల్లో ముంచాడు. నరైన్(1/12), వరుణ్ చక్రవర్తి(1/33) ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు హసరంగ డిసిల్వా(4/20) ధాటికి కోల్కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. నాలుగు వికెట్లతో కోల్కతాను కట్టడి చేయడంలో కీలకమైన డిసిల్వాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
హసరంగ మ్యాజిక్:
బెంగళూరు స్పిన్నర్ వహిందు హసరంగ స్పిన్ మ్యాజిక్తో కోల్కతాను ముప్పుతిప్పలు పెట్టాడు. టాస్ చేజార్చుకుని బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు ఏదీ కలిసిరాలేదు. చెన్నైతో మ్యాచ్లో ఆకట్టుకున్న ఓపెనర్లు రహానే(9), వెంకటేశ్ అయ్యర్(10) ఘోరంగా నిరాశపరిచారు. ఆకాశ్దీప్ బౌలింగ్లో షాట్ ఆడబోయిన అయ్యర్ అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగాడు. రహానే కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన రహానే..షాబాజ్ అహ్మద్ క్యాచ్తో నిష్క్రమించాడు. దీంతో 32 పరుగులకే కోల్కతా ఓపెనర్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకుంటారనుకున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(13), నితీశ్ రానా(10), సునీల్ నరైన్(12), బిల్లింగ్స్(14), జాక్సన్(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. డిసిల్వా తన సుడులు తిరిగే స్పిన్తో కోల్కతా బ్యాటర్లను బుట్టలో వేసుకున్నాడు. ఈ ఆర్సీబీ స్పిన్ను సరిగ్గా అర్థం చేసుకోని కోల్కతా బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. అయితే ఆఖర్లో రస్సెల్(25), ఉమేశ్ యాదవ్(18) బ్యాటు ఝులిపించడంతో కోల్కతా గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. ఆఖరి వికెట్కు ఉమేశ్, వరుణ్ చక్రవర్తి(10 నాటౌట్) నెలకొల్పిన 27 పరుగుల భాగస్వామ్యం అత్యధికం కావడం విశేషం. హర్షల్ పటేల్(2/11), సిరాజ్(1/25) రాణించారు.
సంక్షిప్త స్కోర్లు
కోల్కతా: 18.5 ఓవర్లలో 128 ఆలౌట్(రస్సెల్ 25, ఉమేశ్ యాదవ్ 18, డిసిల్వా 4/20, ఆకాశ్దీప్ 3/45), బెంగళూరు: 19.2 ఓవర్లలో 132/7(రూథర్ఫోర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27, సౌథీ 3/20, ఉమేశ్ యాదవ్ 2/16)