హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్న చిన్నారులను ఆదుకొనేందుకు సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధులతో బాలరక్షక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పలు స్వ చ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాకు ఒకటి చొప్పు న మొత్తం 33 బాలరక్షక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్రంలోని చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బాలరక్షక్ వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాలతోపాటు మహిళా, శిశు సంక్షేమ శాఖకు బస్సును అందజేసిన స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శిశు సంక్షేమశాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ కని అముదాన్, జనరల్ మేనేజర్ శిగ శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ లీడర్ మనోహర్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), మల్లారెడ్డి యూనివర్సిటీ, మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాట్కో ఫార్మా లిమిటెడ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఫౌండేషన్, ఐసీఐసీఐ ఫౌండేషన్, వారధి ఫౌండేషన్, సుమధుర ఫౌండేషన్, యశోదా ఫౌండేషన్, మిస్ ఇండియా మానస వారణాసి, డీఎంఎఎఫ్టీ (నాగర్కర్నూలు), సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, నిర్మాణ్ సంస్థ కలిసి ఈ వాహనాలను అందజేశాయి. వీటిలో భారత్ పెట్రోలియం సంస్థే కోటి రూపాయలతో 15 వాహనాలను సమకూర్చింది.