‘సఖి ఎదురొస్తే అపశకునమే అని నమ్ముతుంటారు ఊరిప్రజలు. తొందరగా పెళ్లిచేసి ఆమెను ఊరినుంచి పంపించాలని ఆరాటపడుతుంటారు. ఆ బ్యాడ్లక్ సఖి ఊరి పాలిట అదృష్టదేవతగా ఎలా మారిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నది కీర్తిసురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్ లక్ సఖి’. నగేష్ కుకునూర్ దర్శకుడు. దిల్రాజు సమర్పణలో సుధీర్చంద్ర పదిరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘రావే రావే సఖి మురిసే ముచ్చట్లకి..సరదా సయ్యాటకి’ అనే పాటను సోమవారం విడుదలచేశారు. దేవిశ్రీప్రసాద్ బాణీలను అందించిన ఈ పాటను హరిప్రియ, సమీరా భరద్వాజ్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఆలపించారు. శ్రీమణి సాహిత్యాన్ని సమకూర్చారు. నిర్మాత మాట్లాడుతూ ‘క్రీడానేపథ్య కథాంశంతో తెరకెక్కుతున్న మహిళ ప్రధాన చిత్రమిది. షూటింగ్ క్రీడలో ఓ పల్లెటూరి అమ్మాయి జాతీయస్థాయిలో ఎలా ప్రతిభను చాటుకున్నదనేది ఆసక్తికరంగా ఉంటుంది. గ్రామీణ యువతిగా కీర్తిసురేష్ నటన, పాత్రచిత్రణ విభిన్నంగా ఉంటాయి. ఈ నెల 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని తెలిపారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్.