ప్రగ్యా సింగ్ సొంతూరు వారణాసి. రైల్లో ఢిల్లీకి బయల్దేరింది. ఆమెకు పెండ్లయి అప్పటికి పన్నెండు రోజులే. ఓ వస్త్ర పరిశ్రమలో ఉద్యోగంలో చేరేందుకు వెళ్తున్నది. అర్ధరాత్రి దాటింది. గాఢ నిద్రలో ఉన్న ఆమెపై ఒక ప్రేమోన్మాది యాసిడ్ చల్లి పారిపోయాడు. ప్రగ్యా ఉలిక్కిపడి లేచింది. కేకలు వేసింది. అప్పటికే మొహమంతా యాసిడ్ విస్తరించింది. కనురెప్పలు కాలిపోయాయి. ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. ముక్కు ఆకృతిని కోల్పోయింది. ఆమెను బతికించేందుకు వైద్యులు పదిహేడు ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం ప్రగ్యా సింగ్ భర్త, పిల్లలతో బెంగళూరులో సంతోషంగా ఉంది.
తనలాంటి వారికోసం ‘అతిజీవన్’ అనే సంస్థను నిర్వహిస్తున్నది. యాసిడ్ బాధితులకు ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులతోపాటు కుటుంబ సమస్యలూ ఎదురవుతాయి. తన సంస్థ ద్వారా వాళ్లకు సాయం అందిస్తున్నది ప్రగ్యా. ‘అయామ్ నాట్ మై ఫేస్’ ఆమె నినాదం. ఇప్పటివరకూ ఢిల్లీ, ఉత్త్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని 250 మంది యాసిడ్ దాడి బాధితులకు చేయూతనిచ్చిందామె. బతికించడమే కాదు, జీవన నైపుణ్యాలనూ నేర్పుతున్నది. కుట్లు, అల్లికలు, గృహాలంకరణల తయారీలో శిక్షణ ఇస్తున్నది. ప్రగ్యా సింగ్ను భారత ప్రభుత్వం నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది.