న్యూఢిల్లీ: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మళ్లీ ప్రత్యక్షం కానున్నాడు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన నెహ్రా ఈ సీజన్లో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ ప్రధాన కోచ్గా ఎంపిక కానున్నాడని సమాచారం. అతడితోపాటు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు విక్రమ్ సోలంకి ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా.. భారత మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ ‘మెంటార్’గా వ్యవహరించనున్నారని ఐపీఎల్ వర్గాలు ధ్రువీకరించాయి.
ఇప్పటికే ఇంటర్వ్యూ చేసి ఆ ముగ్గురిని ఫ్రాంచైజీ పెద్దలు షార్ట్ లిస్ట్ చేశారని ఐపీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎన్నో ఫ్రాంచైజీల నుంచి అవకాశాలు వరుస కడుతున్నా లెఫ్టార్మ్ స్పీడ్స్టర్ నెహ్రా మాత్రం ప్రధాన కోచ్గా అయితేనే వెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ ఆలోచనతోనే గత రెండు సీజన్లకు దూరమయ్యాడు.