Pawan Kalyan : లెజెండరీ సింగర్ శ్రీమతి ఆశా భోంస్లే మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సినిమాలో ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరమని, ఆమె లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ సహా అనేక భాషలలో కొన్ని దశాబ్దాలపాటు ఆశా భోంస్లే లెక్కలేనన్ని చిరస్మరణీయ గీతాలను ఆలపించారు. శాస్త్రీయ, పాశ్చాత్య, సమకాలీన సంగీత శైలులలో ఆమె చూపిన అసాధారణమైన బహుముఖ ప్రజ్ఞ అని, అన్ని తరాల సంగీత ప్రియుల మన్ననలను పొందిందని కొనియాడారు.
‘దమ్ మారో దమ్’, ‘చురాలియా హై తుమ్నే’, ‘ఇన్ ఆంఖోం కీ మస్తీ’, ‘రాధా కైసే నా జలే’ వంటి ఆమె పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమాలలో ఆమె పాడిన పాటలు తక్కువే అయినా, హిందీ సంగీతం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఎంతో ఆదరణ పొందారని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.