తిరువనంతపురం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై కేరళ సీఎం పినరయి విజయన్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరువనంతపురం హెడ్క్వార్టర్గా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ లైఫ్కేర్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) ఓపెన్ బిడ్డింగ్లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనకుండా నిరోధించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇది సహకార సమాఖ్య విధాన సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. ఇటువంటి విషయాల్లో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. హెచ్ఎల్ఎల్ను ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని 2017లో రాసిన లేఖను విజయన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ, కేంద్రం ముందుకు పోవడంతో ఓపెన్ బిడ్డింగ్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిని కనబర్చిందని తెలిపారు. బిడ్డింగ్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ పీఎస్యూ అనర్హులని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్మెంట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. హెఎల్ఎల్ను కేంద్రం ప్రభుత్వ సంస్థగా కొనసాగించకూడదని ప్రతిపాదిస్తే, రాష్ట్ర పీఎస్యూగా కొనసాగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.