హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): అరుణ్సాగర్ రచనలు ఓ ప్రవాహం లాంటివని, ఆధునిక కావ్యశైలికి ఆరాధ్యుడని వక్తలు కొనియాడారు. అరుణ్సాగర్ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి, విమర్శకుడు ప్రసాదమూర్తికి, విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావుకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అందజేశారు. ఈ సందర్భంగా అరుణ్సాగర్ కవిత్వంలో ఆధునికత తొణికిసలాడుతుందని, అది ఎంతో ప్రామాణికమైదని ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. మదినిండా ప్రసన్నతను పలికించే రచనలు ఆయన సొంతమని కొనియాడారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ మాట్లాడుతూ.. అరుణ్సాగర్ కవిత ధిక్కార స్వరమని పేర్కొన్నారు. లోతైన అవగాహన నుంచే సాగర్ కవిత్వ ప్రవాహం కొనసాగిందన్నారు. ఆయన రచనలు నేటితరం జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు.
సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత కే శివారెడ్డి మాట్లాడుతూ.. అరుణ్సాగర్ రచనలు విలువలను మోసుకొచ్చిన మెరుపులా ఉంటాయని పేర్కొన్నారు. ఆధునిక శైలికి ఆరాధ్యుడిగా తనదైన ముద్ర వేసుకొన్నారని చెప్పారు. సిటీ లైఫ్, లైఫ్ లైన్ అంశాలతో పాత్రికేయ రంగంలో అరుణ్సాగర్ నూతన ఒరవడిని సృష్టించారని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి గుర్తుచేసుకొన్నారు. జర్నలిజంలో నూతన శైలిని తీసుకొచ్చి సృజనాత్మకతను నెలకొల్పారని చెప్పారు. సాహిత్య అకాడమీ తరపున అరుణ్సాగర్ స్మారక ఉపన్యాసాల సభలు నిర్వహించే బాధ్యత తీసుకుంటామని అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. సత్యాన్ని పాఠకులకు అందించాలన్న నిబద్ధతతో అరుణ్సాగర్ పనిచేశారని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ కొనియాడారు. జర్నలిజం పట్ల అత్యంత అవగాహనతో పనిచేసిన తీరు అందరికీ ఆదర్శమని అన్నారు.
అరుణ్సాగర్ కవిత్వం నిరంతర ప్రవాహమని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఆరు నెలల్లో అరుణ్సాగర్ రచనలపై సమగ్ర సంకలనాన్ని తీసుకొస్తామని చెప్పారు. అరుణ్సాగర్ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీత ప్రసాదమూర్తిని విశ్రాంత ప్రొఫెసర్ శిఖామణి పరిచయం చేస్తూ.. సప్తవర్ణం లాంటి కవిత్వం ఆయన సొంతమని ప్రశంసించారు. విశిష్ట పాత్రికేయ పురస్కార గ్రహీత ఎం నాగేశ్వర్రావు నూతన ఒరవడుల రూపకల్పనలో పాత్రికేయరంగంలో ప్రత్యేకమని సమ్మెట నాగ మల్లేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో అరుణ్సాగర్ ట్రస్టు నిర్వాహకులు మువ్వా శ్రీనివాసరావు, ముప్పనేని రాజ్కుమార్, వైజే రాంబాబు, టీ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అరుణ్సాగర్ నా గుండెల్లో ఉన్నాడు
అరుణ్సాగర్తో అనేక ఏండ్లు లాంగ్ జర్నీ చేశాను. ఏనాడూ అలసిపోని వ్యక్తిత్వం ఆయనది. ఆయన కవిత్వానికున్న శైలి ఆయనకే సొంతం. అరుణ్ నా గుండె లోతుల్లో కొలువై ఉన్నాడు. ఆయన జ్ఞాపకాలు ప్రతినిత్యం నన్ను కదిలిస్తూనే ఉంటాయి.
-కవి ప్రసాదమూర్తి,
అరుణ్సాగర్ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీత
పదునైన భాష ఆయన సొంతం
అరుణ్సాగర్ కవిత్వం పదునైన భాషతో మొదలవుతుంది. సాహిత్యంలో, పాత్రికేయరంగంలో విమర్శలకు వెనుకడుగు వేయలేదు. ఆయన రాసినా, మాట్లాడినా నిస్వార్థమైన వ్యక్తిత్వం ఉట్టిపడేది. వ్యక్తిగత లక్ష్యాలు కాకుండా, వృత్తిపరమైన లక్ష్యాలతో ముందుకు సాగారు.
-ఎం నాగేశ్వర్రావు,
అరుణ్సాగర్ విశిష్ట పాత్రికేయ పురస్కార గ్రహీత