Fact Check | అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రోజుకొక రకంగా మోసానికి తెరతీస్తున్నారు. మొబైల్ ఫోన్లను వేదికగా చేసుకుని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఫలానా లింక్పై క్లిక్ చేసి, పేరు నమోదు చేసుకుంటే కొలువులు వస్తాయి.. సొమ్ములొస్తాయి అని ఆశలు రేపుతున్నారు. అలా లింక్ క్లిక్ చేసిన వారిని నిలువునా దోచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం.. ఆయుష్ యోజన పేరిట సైబర్ మోసగాళ్లు మోసాలకు దిగారు. ఆయుష్ పథకం కింద అర్హులైన వారికి నెలవారీ ఆకర్షణీయ వేతనం వస్తుందంటూ.. ఈ కింది లింక్ క్లిక్ చేయాలని మెసేజ్లు పంపుతున్నారు. దీనిపై కేంద్రం అప్రమత్తమైంది.
కేంద్ర ప్రభుత్వ ఆయుష్ యోజన పథకం కింద ఉద్యోగానికి మీరు ఎంపికయ్యారు. మీ శాలరీ రూ.78,856.. ఈ లింక్ క్లిక్ చేస్తే ప్రతి నెలా రూ.50 వేల చొప్పున ఆదాయం సంపాదించుకోవచ్చునని ఉన్న స్క్రీన్షాట్ను కేంద్ర సమాచార ప్రసారాలశాఖ అనుబంధ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఇది ఫేక్ మెసేజ్ అని, ఇటువంటి మెసేజ్ల పట్ల అలర్ట్గా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.