AP News : స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్కు పంపారు. విజయనగరం జడ్పీ ఛైర్మన్, భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్గానూ చిన్న శ్రీను పనిచేస్తున్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి ఇన్ఛార్జ్ పదవికీ ఆయన రాజీనామా చేశారు.
కొన్నాళ్లుగా బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. పార్టీలో మేనల్లుడి ప్రాధాన్యత తగ్గించేలా బొత్స ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబును చిన్న శ్రీను కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.