హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)/ మక్తల్ టౌన్: విధులకు వెళ్తున్న ఓ ఏఎన్ఎం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం వడ్వాట్గేటు వద్ద బుధవారం చోటుచేసుకున్నది. వెంటనే స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు.. బాధిత కుటుం బానికి రూ.50 లక్షల బీమా చెల్లిస్తామని ప్రకటించారు. మక్తల్ పట్టణానికి చెందిన వరలక్ష్మి (28) మాగనూరు పీహెచ్సీ పరిధిలోని కొల్పోర్ సబ్సెంటర్లో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు.
బుధవారం ఉద యం మాగనూరు పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని కొల్పూరుకు స్కూటీపై బయలుదేరారు. వడ్వాట్ గేటు సమీపంలో రాయిచూర్ నుంచి హైదరాబాద్కు మట్టి లోడ్తో వెళ్తున్న లారీ వెనుక నుంచి వేగంగా స్కూటీని ఢీకొట్టింది. దీంతో వరలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వరలక్ష్మి మృతిపట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతాపం తెలిపారు. కరోనా విధుల్లో ఉండి మరణించినవారికి ఇచ్చే రూ.50 లక్షల బీమాను ఆమె కుటుంబానికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వైద్యసిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివంటూ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.