ప్రస్తుతం కథానాయికలు ప్రధాన స్రవంతి సినిమాల్లో నటిస్తూనే ఓటీటీ మాధ్యమాలపై దృష్టిపెడుతున్నారు. వెబ్సిరీస్లలో వినూత్న కథాంశాల్ని ఎంచుకునే అవకాశాలు ఉండటంతో తమ ప్రతిభను చాటుకోవడానికి వాటిని మంచి మార్గాలుగా భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రకథానాయికలు ఓటీటీ వేదికలపై తమ అదృష్టాన్ని పరీక్షించుకొని విజయం సాధించారు. వారి బాటలోనే అచ్చతెలుగందం అంజలి వెబ్సిరీస్లో అరంగేట్రం చేస్తున్నది. ‘ఝాన్సీ’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ మహిళా ప్రధాన సిరీస్లో అంజలి శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది.
ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్లో తొలిసారి యాక్షన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నా. భావోద్వేగాలు కలబోసిన ప్రతీకార కథ ఇది. ఈ సినిమా కోసం పోరాటఘట్టాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. ఈ తరహా పాత్రకు నేను సరిపోతానా లేదా అని మొదట సందేహించాను. దర్శకనిర్మాతలు అందించిన ధైర్యంతో అంగీకరించా. నా కెరీర్లో వైవిధ్యమైన ప్రయత్నంగా నిలుస్తుంది’ అని చెప్పింది. తెలుగులో రూపొందిస్తున్న ఈ సిరీస్ను ఏడు భారతీయ భాషల్లో అనువదించబోతున్నారు.