బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మూగజీవులను ఎంతగా ప్రేమిస్తుందో.. ఆమెను ఫాలో అవుతున్న వారికి తెలిసిందే. వాటి సంక్షేమం కోసం సోనాక్షి చేస్తున్న పనులు ప్రఖ్యాత జంతు సంరక్షణ సంస్థ పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)ను ఆకర్షించాయి. అందుకే, ఈ ఏడాది ‘పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా సోనాక్షిని ఎంపిక చేశారు. హ్యాండ్ బ్యాగుల తయారీకి జంతు చర్మాన్ని వినియోగించడాన్ని నిరసిస్తూ రక్తమోడుతున్న బ్యాగుతో ఆమె పెట్టిన పోస్టుకు అప్పట్లో విపరీతమైన స్పందన వచ్చింది.
చర్మం కోసమే ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు మొదలైన మూగజీవాలను అత్యంత క్రూరంగా చంపుతున్నారంటూ నిరసన వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయంగా పైనాపిల్ ఆకులు, పండ్ల వ్యర్థాలు, పుట్టగొడుగులతో తయారయ్యే వేగన్ లెదర్ను ఉపయోగించవచ్చని సలహా ఇచ్చింది. వీధి కుక్కలు, పిల్లులను దత్తత తీసుకునేలా ఎంతో మందిని ప్రోత్సహించింది. గతంలో విరాట్ కోహ్లి, అలియా భట్, మాధవన్, హేమమాలిని ఈ పురస్కారం అందుకున్నారు.