కోపం వచ్చేయగానే.. దయ్యం పట్టినట్టో, పూనకం వచ్చినట్టో ఊగిపోకుండా ఓ నిమిషం స్థిమితంగా ఆలోచించాలి. అది శరీరానికి సంబంధించిందా, ఆలోచనలకు సంబంధించిందా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు కోపం మన ప్రాథమిక భావోద్వేగం కాకపోవచ్చు. ఏదో సందర్భాన్ని బట్టి పైపైనే వచ్చిందై ఉండొచ్చు. తీవ్ర నిరాశ, మనసు గాయపడటం, బాధ, ఉద్రేకం, నిస్సహాయత, వేదన, ఏదో అయిపోయిందన్న ఆందోళన, అలసట, సిగ్గు లాంటి భావోద్వేగాలు కూడా కొన్నిసార్లు కోపం ముసుగులో బయటపడుతుంటాయి. వీటిని గుర్తించి పరిష్కరించుకోవడం ఉత్తమం. లేకపోతే, ఆ కోపం ముదిరిపోయి క్రౌర్యంగా మారవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించకూడదు. శాంతించిన తర్వాత.. నిదానంగా స్పందించడం నేర్చుకోవాలి. అస్తిత్వవాద మానసిక నిపుణుడు ఇర్వింగ్ యాలోమ్ చెప్పినట్లు ‘ఇనుమును చల్లగా ఉన్నప్పుడే మోగించాలి’. అంతే!