హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ఏపీ పాలన వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును సోమవారం ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో సోమవారం ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఈ రెండు బిల్లులను ఉపసంహరించుకుంటున్నామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యాయపరమైన చిక్కులు లేకుండా, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని తెలిపారు.
ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని గత ప్రభుత్వమే లెక్క వేసిందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలనే ఉద్దేశంతోనే మూడురాజధానుల గురించి ఆలోచించామని, న్యాయపరమైన చిక్కులు సృష్టించి ముందుకు వెళ్లకుండా చేశారని, అందుకే ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని తెలిపారు.
మరో ఆలోచన లేకుండా అమరావతినే రాజధానిగా ప్రకటించాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. వికేంద్రీకరణపై మాట్లాడే హక్కు వైసీపీకి, సీఎం జగన్కు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరమని జనసేన తెలిపింది.