ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తుండగా..అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా రూపకల్పనలో సాంకేతిక సహకారం అందించాలంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా మహీంద్ర కంపెనీ అధిపతి ఆనంద్ మహీంద్రను కోరారు. ‘ప్రతిష్టాత్మకంగా మేము రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో అత్యున్నత సాంకేతికత కలిగే కొన్ని వాహనాలు తయారు చేయాలనుకుంటున్నాం. వీటి తయారీకి మీ ఇంజినీర్ల సహకారం కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ విజ్ఞప్తికి స్పందించిన ఆనంద్ మహీంద్ర…‘రేపటితరం వాహనాలను ఆవిష్కరించాలన్న మీ ప్రయత్నానికి తోడుంటాం. మా గ్లోబల్ ప్రాడక్ట్ డెవలప్మెంట్ అధికారి వేలు మహీంద్ర మీకు సహకారం అందిస్తారు’ అని పేర్కొన్నారు. ‘ప్రాజెక్ట్ కె’ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది.