గణేశ్ నవరాత్రులు దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారీలో వేగం పెరిగింది. గతేడాది కొవిడ్ వ్యాప్తి కారణంగా గణపతి వేడుకలు ఇండ్లకే పరిమితమయ్యాయి. భారీ విగ్రహాలు కొనేవారు లేక తయారీదారులు నష్టాలు చవిచూశారు. ఈసారి కొవిడ్ తగ్గుముఖం పట్టడం, నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని భక్తులు భావిస్తున్న తరుణంలో తయారీదారుల్లో జోష్ కనిపిస్తున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున బొజ్జ గణపయ్య విగ్రహాలను తీర్చిదిద్దిన తయారీదారులు వాటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.