ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ శుక్రవారం అనుమానాస్పదంగా మరణించారు. థాణే సమీపంలోని కాలువలో తేలిన ఆయన మృతదేహాన్ని నౌపాడా పోలీసులు వెలికితీశారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద ఫిబ్రవరి 25న ఒక ఎస్యూవీ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలైన జెలటిన్ స్టిక్స్తోపాటు అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ఒక లేఖ అందులో లభించాయి.
మరోవైపు ఆ వాహనం గురించి పోలీసులు ఆరా తీయగా దాని యజమాని మన్సుఖ్ హిరెన్గా గుర్తించారు. గత ఏడాదిగా దానిని వాడటం లేదని, ఆ వాహనాన్ని అమ్మేందుకు ఫిబ్రవరి 16న డ్రైవ్ చేసినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. అయితే మధ్యలో వాహనం ఆగిపోవడంతో ములుండ్-ఐరోలి లింక్ రోడ్ వద్ద దానిని వదిలివేశానని, మరునాడు వచ్చి చూడగా దానిని ఎవరో దొంగిలించారని చెప్పారు. కారు చోరీ గురించి విఖ్రోలి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో వెల్లడించారు. అయితే శుక్రవారం ఆయన అనుమానాస్పదంగా మరణించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.