హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్లోని కేఐఐటీ వేదికగా జరుగుతున్న 81వ అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ మహిళల అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్లేయర్ భాగ్యలక్ష్మి పసిడి పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 1500మీటర్ల రేసును భాగ్యలక్ష్మి 4:27:82 సెకన్ల టైమింగ్తో పూర్తి చేసింది. చిరుతను తలపించిన ఈ పాలమూరు అథ్లెట్ స్వర్ణం సాధించడం ద్వారా చైనా వేదికగా జూన్లో జరిగే ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్కు అర్హత సాధించింది. ఇదే పోటీలో పాల్గొన్న వర్ష(కురుక్షేత్ర యూనివర్సిటీ, 4:30:01సె), సునీత(హిమాచల్ప్రదేశ్ యూనివర్సిటీ, 4:30: 15 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న భాగ్యలక్ష్మి.. పేదరికాన్ని అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకుంది. సాయ్గోపీచంద్ మైత్రా అథ్లెటిక్స్ ప్రాజెక్ట్ ద్వారా ఆర్థిక, శిక్షణ సౌకర్యాలు పొందుతూ అద్భుత ప్రదర్శన కనబరుస్తుందని కోచ్ నాగపురి రమేశ్ పేర్కొన్నారు. మరోవైపు స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ మహిళల 100మీటర్ల రేసును 11.44 సెకన్లలో ముగించి పసిడి పతకం కైవసం చేసుకుంది. గతంలో తన పేరిటే ఉన్న 11.57 సెకన్ల రికార్డును ద్యుతీ తాజాగా తిరుగరాసింది.