అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు సందర్భానుసారంగా తన గాత్రంతో అభిమానులకు వీనులవిందు చేస్తుంటారు అగ్ర హీరో నాగార్జున. సీతారామరాజు, నిర్మలాకాన్వెంట్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల్లో ఆయన గళం అభిమానుల్ని అలరించింది. సుదీర్ఘ విరామం తర్వాత మరోమారు గొంతు సవరించారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్కృష్ణ దర్శకుడు. నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. మంగళవారం మైసూర్లో తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సినిమాలో నాగార్జున గొంతు కలిపిన ‘లడ్డుండా..’ అనే లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఆయనతో పాటు ధనుంజయ్, మోహన భోగరాజు, మోహన్, హరిప్రియలు ఈ గీతాన్ని ఆలపించారు. నాగార్జున మాటలతో ఈ పాట ప్రారంభమైంది. ‘చెరుకు తోటలో చారెడు బియ్యం..వంగ తోటలో మరదలు కయ్యం..లగెత్తి కొడితే లడ్డుండా..మాటల్లోనే మల్లెల చెండు..చూపుల్లోనే కితకితలుండు..కళ్లను చూస్తే కలువ పువ్వులు..’ అంటూ ఈ పాట సాగింది. బంగార్రాజు పాత్రను పరిచయం చేసే సందర్భంలో ఈ పాట వస్తుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్రూబెన్స్, నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ, దర్శకత్వం: కల్యాణ్కృష్ణ.