బెంగుళూరు: కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై కన్నీటి పర్యంతమయ్యారు. 777 ఛార్లీ సినిమా చూసి ఆయన ఏడ్చేశారు. కుక్కపిల్ల స్టోరీతో తీసిన ఛార్లీ సినిమాను సోమవారం సీఎం బసవరాజ్ చూశారు. అయితే తన పెంపుడు కుక్క స్నూబీ గుర్తు వచ్చినట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గత ఏడాది స్నూబీ చనిపోయింది. సీఎం పదవీ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఆ శునకం మరణించింది. జూన్ 10న రిలీజైన ఛార్లీ మూవీ విశేషంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాను కచ్చితంగా అందరూ చూడాలని సీఎం బొమ్మై తెలిపారు. గతంలో కుక్కలపై సినిమాలను తీశారని, కానీ ఈ సినిమాలో జంతువులకు, వాటి మనోభావాలను గొప్పగా చూపించినట్లు సీఎం బొమ్మై అన్నారు. కుక్కలు తమ మనోభావాల్ని కండ్ల ద్వారా వ్యక్తం చేస్తాయని, సినిమా బాగుందని, ప్రతి ఒక్కరు చూడాలన్నారు. అపరిమితమైన ప్రేమ ఉండాలని, శునకాలకు ప్రేమ అపరిమితంగా ఉంటుందని ఆయన అన్నారు.