అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’. 26/11 దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకుడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘ఓహ్..ఇషా..’ అంటూ సాగే రెండో గీతాన్ని ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు.
శ్రీచరణ్ పాకాల స్వరకర్త. ఈ పాటలో 1995 నాటి సందీప్ ఉన్నికృష్ణన్ ప్రేమకథను చూపించబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ వింటేజ్ లుక్తో ఆకట్టుకుంటున్నది. ‘మేజర్ సందీప్ జీవిత పయనంలోని ముఖ్య ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా సాగుతుంది. కాలేజీ రోజుల్లోని ఆయన ప్రేమకథ, సైన్యంలో పనిచేసిన నాటి అనుభవాలు ప్రేక్షకుల మనసుల్ని కదిలిస్తాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.