దండేపల్లి, ఫిబ్రవరి 8: గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. రేపటి నుంచి (గురువారం) ప్రారంభమయ్యే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దేవస్థాన ఈవో సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు 17 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. స్వామి వారి కల్యాణం సందర్భంగా ప్రధాన ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు.సత్యనారాయణస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలకు రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. స్వామి వారి కల్యాణం కోసం భక్తులు రూ.500 కల్యాణ రుసుం చెల్లించి రసీదు పొందాలన్నారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ నెల 13న గోధూళిక సుముహుర్తాన సత్యనారాయణస్వామి కల్యాణం, 16న మాఘశుద్ధ పౌర్ణమి జాతర నిర్వహించనున్నారు. ఈనెల 10 నుంచి 12 వరకు ఆలయంలో నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి, విశ్వక్సేనారాధన, దీక్ష కంకణాధారణ, నిరంతర సప్తాహ భజనలు, 13న నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి, వాసుదేవ పుణ్యహవచనము, విశ్వక్సేనారాధన, రుత్విగ్వరణమ్, అంకురార్పరణం, పటాదివాసమం, ధ్వజారోహణం, సాయంత్రం 5 గంటలకు గోధూళిక సుముహూర్తమున స్వామి వారి కల్యాణ మహోత్సవం, 14న నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థ ప్రసాదగోష్టి, హవనం, స్థాళీపాక, పంచసూక్త హోమములు, బలిహరణము, నిత్య హోమములు, 15న నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థ ప్రసాదగోష్టి, నవగ్రహ హోమము, పంచసూక్త హోమములు, బలి హరణము, నిత్యహోమములు,16న నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి, హవనం, నిత్యహోమములు, జయాదిహోమ, శాంతి హోమములు, మహాపూర్ణాహుతి, బలిహరణము, సాయంత్రం 6 గంటలకు స్వామి వారి సేవా ఉత్సవం, 17న స్వామివారి రథోత్సవం, సప్తాహ భజన, పరిసమాప్తము, ఏకాంత సేవతో స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయని ఆలయ ఈవో తెలిపారు.