ఆదిలాబాద్ రూరల్, మార్చి 31: పట్టణంలో మాస్కులు లేకుండా తిరిగే వారికి జరిమానా తప్పదని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు దుకాణాలు, హోటళ్లను తనిఖీ చేశారు. మాస్కు లేని వారికి రూ.200 చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తప్పకుండా మాస్కు ధరించాలని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ అధికారి నర్సింహులు, అధికారులు ఉన్నారు.
మాస్కులు ధరించాలి
బేల, మార్చి 31: కరోనా నివారణలో భాగంగా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని ఎస్ఐ సాయన్న సూచించారు. మండల కేంద్రంలోని వారసంతలో ప్రజలకు అవగాహన కల్పించారు. మార్కెట్ యార్డులో మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించడమే కాకుండా, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు.
భీంపూర్, మార్చి 31: ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని భీంపూర్ ఎస్ఐ ఆరిఫ్ సూచించారు. భీంపూర్, నిపాని, సెంటర్సాంగ్వి గ్రామాల్లో ప్రజలకు కరోనా నియంత్రణపై అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామని అవసరమైతే జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది నాగ్నాథ్, ఉత్తమ్ పాల్గొన్నారు.
మాస్కులు అందజేత
ఉట్నూర్, మార్చి 31: మండల కేంద్రంలోని జగ్జీవన్రామ్ చౌక్లో మహాజన్ సేవా సమితి సభ్యులు బుధవారం ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండర్ కొరండ్ల శంకర్, సభ్యులు సలాం దేవ్రావు, అంగద్, దుర్గం అభిమాన్, శ్యాంరావు, గణేశ్ పాల్గొన్నారు.