ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 6: మహిళలు స్వీయ రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు ధైర్యంతో ఎదిరించే సాహసం చేయాలని రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్శిటీలో సోమవారం జరిగిన మహిళా భద్రతా వారోత్సవాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గర్ల్స్ సేఫ్టీ క్లబ్ను ప్రారంభించారు. మహిళా విద్యార్థులు, ఉద్యోగుల భద్రత కోసం షీ టీ మ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రక్షణ కవచంలా పని చేస్తున్నట్లు తెలిపారు.
మహిళల రక్షణే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులకు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే 100వ నంబర్కు డయల్ చేసి రక్షణ పొందాలని సూచించారు. కళాశాల యాజమాన్యాలు మహిళల భద్రత, స్వీయ రక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపన్యాస, పోస్టర్ ప్రదర్శన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సీఈఓ నీలిమ, రిజిస్ట్రార్ సమీన్ ఫాతిమా, డీన్లు బాలాజీ, వసుధ, శ్రీదేవి, శిరీష పాల్గొన్నారు.