ప్రత్యేక క్యాటగిరీ మహిళలకు మాత్రమే
కొత్త నిబంధనలను నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్రత్యేక క్యాటగిరీల మహిళలకు గర్భస్రావం గడువును 20 వారాల నుంచి 24 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అమెండ్మెంట్) రూల్స్, 2021 చట్టం ప్రకారం.. లైంగిక దాడి బాధితురాళ్లు, రక్తసంబంధీకుల చేత లైంగికంగా వేధింపులకు గురైనవారు, మైనర్లు, విడాకులు తీసుకోబోతున్న/భర్తను కోల్పోయిన మహిళలు, అంగవైకల్యం, చిత్త వైకల్యం కలిగిన మహిళలు ఈ క్యాటగిరీ కిందకు వస్తారని వెల్లడించింది. పిండ వైకల్యం నిర్ధారణ అయిన సందర్భాల్లో కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించింది. అయితే రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు దీన్ని నిర్ధారించాలని పేర్కొంది. గర్భస్రావం అభ్యర్థన చేసుకున్న మహిళ.. తన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవడానికి మూడ్రోజుల సమయం ఇస్తున్నట్టు వివరించింది.