పనాజీ: ఇప్పటికే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 8 జాబితాల్లో 100 మందికిపైగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపికచేసే పనిలోపడింది. 10 మంది అభ్యర్థుల పేర్లతో ఇవాళ తొలి జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో గతంలో బీజేపీ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మహదేవ్ నాయక్, అలీనా సల్దాన్హాతోపాటు ఇటీవల న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లో వచ్చిన అమిత్ పాలేకర్ ఉన్నారు.
ఉత్తర గోవా, దక్షిణ గోవాల్లోని 10 స్థానాలకు ఖరారైన ఈ అభ్యర్థుల జాబితాకు గోవా ఆప్ చీఫ్ అతిషి ఆమోదం తెలిపారు. దాంతో గోవాలో అభ్యర్థుల జాబితా ప్రకటించిన రెండో పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అయ్యింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా 10 మంది అభ్యర్థులతో తొలి జాబితాను వెల్లడించింది. అమిత్ పాలేకర్ శాంటా క్రుజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు జాబితాలో తెలిపారు.
ఇక పోరియం స్థానం నుంచి బీజేపీ నుంచి ఆప్లోకి వచ్చిన నేత విశ్వజిత్ క్రిష్ణారావు రాణే పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి మహదేవ్ నాయక్ శిరోడా నుంచి, ఆప్ నేత సత్యవిజయ్ నాయక్ వాల్పాయ్ నుంచి బరిలో దిగనున్నారు. గోవాలో మొత్తం 40 స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ముందుగా 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. మరో 30 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది.