సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం మేయర్ చాంబర్లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బృందంతో మహిళా సాధికారత అనే అంశంపై మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. మహిళలకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పూర్తి చేయూతనందిస్తున్నదని తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న పేద పిల్లలను సూల్లో చేర్పించి ఉచితంగా పుస్తకాలు, పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. నగరంలోని నిరుపేదలకు, నిరాశ్రయులకు నిరంతరాయంగా ఆహారం, షెల్టర్ కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు మగవారికంటే కొన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
చదువు ద్వారానే సమాజంలో మార్పు
మహిళలు చదువు, ఉద్యోగం, ఆర్థికంగా వంద శాతం ముందంజలో ఉండాలని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. మహిళలు తమ పిల్లలను చదివించడం ద్వారా సమాజంలో మార్పు వస్తుందన్నారు. మహిళలపై ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగకుండా వారికి సామాజికంగా భద్రత కల్పించాలన్నారు. మహిళలందరూ తమ ఓటు హకు ద్వారా సరైన నాయకులను ఎంపిక చేసుకోవాలని, వంద శాతం ఓటు హకును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం డిప్యూటీ హై కమిషనర్గా వ్యవహరించిన కత్రీన్ కరొన్య మేయర్ గద్వాల విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి మహిళా సాధికారతపై జీహెచ్ఎంసీలో చేపడుతున్న చర్యలను మేయర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ అడ్వైజర్ నలిని, సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ, భరత్నగర్ కార్పొరేటర్ సింధు, గన్ఫౌండ్రీ మాజీ కార్పొరేటర్ మమత సంతోశ్గుప్తా తదితరులు పాల్గొన్నారు.