హైదరాబాద్ : ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకు(Char Dham Yatra )భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్జామ్(Traffic jam) కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్ ఘాట్స్ సమీపంలోని బద్రీనాథ్ మార్గం అలాగే కేదార్నాథ్కు దారితీసే సోన్ ప్రయాగ్ వంటి కీలక మార్గాల్లో త్రీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది.
ముఖ్యంగా జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వరకు 25 నుండి 30 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో యాత్రికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. సరైన ఆహారం, నీళ్లు లేక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.
యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ వివరాలను తెలుసుకొని అంతుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కాగా, యాత్రికులకు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, యాత్రా మార్గం పొడవునా ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.