రిపబ్లిక్ డే హింసాకాండ కేసులో నిందితుడుగా ఉన్న పంజాబీ నటుడు దీపు సిద్ధు వాయిస్ టెస్ట్ కి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. తన ప్రసంగాల ద్వారా ఆందోళన కారులను రెచ్చగొట్టేలా చేశాడని దీపు సిద్ధుపై అభియోగాలున్నాయి. ఆ ఆడియో క్లిప్పులో ఉన్న స్వరం దీపుసిద్ధుదేనా అన్నది ధ్రువీకరించేందుకు అనుమతించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. దీన్ని విచారించిన ఢిల్లీ కోర్టు అనుమతి నిచ్చింది.
వ్యవసాయంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్తచట్టాలను రద్దుచేయాలని కోరుతూ గతకొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దులో అన్నదాతలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున ఆందోళనకారులు భారీ సంఖ్యలో రాజధానికి చేరారు. ఆసమయంలో దీపు సిద్ధు కూడా సరిహద్దుల్లో ఉన్న పోలీసులతో వాదనలకు దిగే వీడియోలు వైరల్ గా మారాయి. అంతేకాదు నిరసనకారులు ఎర్రకోట పైకెక్కి జాతీయ జెండాను తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. పలువురిని అరెస్ట్ చేసి కేసులు పెట్టింది. వారిలో పంజాబీ నటుడు దీపుసిద్ధు కూడా ఉన్నారు.