న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడారు. రాష్ట్రపతి ఇచ్చిన ప్రసంగం ప్రభుత్వ లాండ్రీ లిస్ట్ అని ఆరోపించారు. ఆ ప్రసంగాన్ని రాసిన వారే దానికి సమాధానం ఇవ్వాలన్నారు. ఆ ప్రసంగంతో రాష్ట్రపతికి అవమానం జరిగినట్లు ఆయన విమర్శించారు. దేశ ప్రగతి జరగాలని అందరూ భావిస్తారని, కానీ ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నట్లు ఆ ప్రసంగంలో చిత్రీకరించినట్లు ఆయన ఆరోపించారు. నెహ్రూ 14 ఏళ్లు జైలు జీవితం అనుభవించారని, దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలను మీరెలా విశ్లేషిస్తారని ఆనంద్ శర్మ అడిగారు. వాజ్పేయి సమయంలో జరిగిన పనులను మేం ప్రశంసించామని, కానీ కాంగ్రెస్ను గుడ్డిగా ప్రభుత్వం విమర్శిస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన పనులను కొట్టిపారేయలేమని, సింగిల్ ఐడియాలజీ మీద దేశం నడవదని, 2014లో దేశంలోప్రగతి చిగురించలేదని, కానీ 74 ఏళ్ల చరిత్ర అంతమైందని ఆయన అన్నారు.
నిరుద్యోగ యువత గురించి ఎకనామిక్ సర్వే చెప్పిన అంశాలను పరిశీలించాలని, దేశంలో కేవలం 52 కోట్ల మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారని, 42 కోట్ల మందికి ఉద్యోగాలు లేవని ఆనంద్ శర్మ ఆరోపించారు. కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని, మార్చి 2020 వద్దే ఎకానమి నిలిచిపోయిందని, రుణభారం పెరిగిందని, కానీ జాతీయ ఆస్తుల్ని అమ్మడంతో ఆ నష్టాన్ని పూడ్చలేమన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో జాతీయ భద్రతకు సంబంధించిన ఎటువంటి ప్రస్తావన లేదన్నారు. చైనా బోర్డర్ వద్ద లక్ష మంది సైనికుల్ని మోహరించారని , దీనిపై పార్లమెంట్లో ఎందుకు చర్చించరన్నారు. 1962లో యుద్ధం సమయంలో నెహ్రూ పార్లమెంట్లో చర్చ చేపట్టినట్లు గుర్తు చేశారు. చైనాపై ఇన్కెమెరా బ్రీఫింగ్ ఉంటుందన్నారు, కానీ అటువంటిదేమీ జరగలేదని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్ యుద్ధంలో మరణించిన వారికి నివాళిగా అమర్ జవాన్ జ్యోతిని అంకితం చేశామని, కానీ ఇప్పుడు ఆ జ్యోతిని విలీనం చేశారని, నేను ఓ హిందువును అని, ఆ ధర్మం ప్రకారం జ్యోతుల్ని విలీనం చేయరని ఆయన అన్నారు. భారతీయ సంతతి ప్రజలు అంతాటా ఉన్నారని, దేశ ప్రతిష్టను ధ్వంసం చేయవద్దు అని ఆయన తెలిపారు.