కోల్కతా : పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో చేపల వేటకు వెళ్లి తొమ్మిది మంది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. జమునా రాణి లాల్ యాజమాన్యంలో ట్రాలర్ గత ఐదు రోజుల కిందట బంగాళాఖాతంలోకి 12 మంది మత్స్యకారులతో చేపల వేటకు బయలుదేరింది. చేపలు పట్టుకొని తిరిగి వస్తున్న సమయంలో బుధవారం బక్కాలీ తీరంలోని రక్తేశ్వరి ద్వీపానికి సమీపంలో అకస్మాత్తుగా వచ్చిన అలల తాకిడికి ట్రాలర్ బోల్తాపడిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రాలర్ డెక్పై ఉన్న ఇద్దరిని మరో బోటులో ఉన్న వారు రక్షించారు.
ప్రమాదం జరిగిన సమయంలో మరో పది మంది మత్స్యకారులు నిద్రలో ఉన్నారని, దీంతో వారు తప్పించుకునేందుకు అవకాశం లేకుండాపోయిందని అధికారులు భావిస్తున్నారు. మునిగిపోయిన ట్రాలర్ను గురువారం గుర్తించగా.. క్యాబిన్లో నుంచి తొమ్మిది మంది మృతదేహాలను గుర్తించామని, మరొకరి ఆచూకీ దొరుకలేదని అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. పెట్రోలింగ్ వాహనాలతో పాటు డ్రోన్ల సహాయంతో గాలింపు చేపడుతున్నట్లు వివరించారు.