న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: గోవా, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సోమవారం గోవాలో 40 స్థానాలకు, ఉత్తరాఖండ్లో 70 సీట్లకు ఓటింగ్ జరిగింది. గోవాలో రికార్డు స్థాయిలో 79 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్లో 65.1% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2017లో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఉత్తరాఖండ్లో ఓటింగ్ తగ్గింది. అప్పుడు 65.64% ఓటింగ్ జరిగింది. ఎన్సీసీ వలంటీర్లు వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలో సాయం చేశారు. యూపీలో రెండో దశలో భాగంగా 55 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. యూపీలో రెండో విడుతలో 60.44 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.
నో రోడ్.. నో ఓట్!
రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని, రోడ్డు నిర్మించాలని ఆ రెండు గ్రామాల ప్రజలు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయినా వారి డిమాండ్ను ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టింది. దీంతో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజైన సోమవారం ఆయా గ్రామాల ప్రజలు బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఉన్నతాధికారులు వచ్చి పోలింగ్లో పాల్గొనాలని కోరినా.. ఓటేసేది లేదని తెగేసి చెప్పారు. కేదార్నాథ్ నియోజకవర్గం జగ్గి బగ్వాన్, చిలౌంద్ గ్రామాలకు సరైన రోడ్డు వసతి లేదు. తమ సమస్యలను పట్టించుకోనందుకు నిరసనగా జగ్గి బగ్వాన్, చిలౌంద్ గ్రామాల ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు.
కలుషిత నీటితో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
ఉత్తరప్రదేశ్లోని శేఖుపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు గ్రామాలు సోమవారం పోలింగ్ను బాయ్కాట్ చేశాయి. తమ ప్రాంతాలకు కలుషిత నీటి సరఫరాపై నిరసనగా నరౌ, మిలాల్ నంగ్లా గ్రామాల ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. సమస్యను పరిష్కరించేంత వరకు తాము ఓటేయబోమని, కలుషిత నీరు కారణంగా పలువురు మరణించారని, అనేక మంది తీవ్రవ్యాధులతో బాధపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.