సిటీబ్యూరో, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): అలర్జీ అనేది ప్రతి ఒక్కరిలో ఏదో రూపంలో వేధిస్తుంది. పైగా ఇది దీర్ఘకాలిక వ్యాధి. కొన్ని రకాల పదార్థాలు, వాతావరణ పరిస్థితులు.. ఇలా అనేక రకాల కారణాలతో వస్తుంది. అది ఏ రకమైన ఎలర్జీయో గుర్తించి..చక్కటి చికిత్స అందిస్తే.. ఉపశమనం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏడాదిన్నర కిందట ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో ఏర్పాటైన అలర్జీ క్లినిక్కు విశేష స్పందన వస్తున్నది. ఇక్కడ చక్కటి వైద్యం అందిస్తుండటంతో రోగుల తాకిడి పెరుగుతున్నది. ప్రారంభంలో కేవలం వారానికి ఒకరోజు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ క్లినిక్ సేవలను.. వారంలో రెండు రోజులకు పెంచారు. ప్రతి బుధ, శనివారాల్లో ఈ క్లినిక్లో 90 రకాల అలర్జీల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వారానికి 70 నుంచి 80 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
40 నిమిషాల్లో..
అలర్జీ పీడితుల్లో అలర్జన్స్ను గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘స్కిన్ప్రిక్’ పరీక్షలను నిర్వహిస్తారు. 30 నుంచి 40 నిమిషాల్లో జరిపే ఈ టెస్టుల ద్వారా రోగికి ఉన్న అలర్జీ ఏ రకమైనదో గుర్తించడంతో పాటు దేని వల్ల వస్తుందో కూడా నిర్ధారిస్తారు. పరీక్ష ఫలితాల ఆధారంగా మందులు అందజేస్తారు.
90 రకాల అలర్జీలకు..
ఎక్కువగా బాధించే ప్రధాన అలర్జీలు 90 రకాలు ఉన్నాయి. బాధితుల్లో 99 శాతం ఈ రకమైన అలర్జీలతోనే బాధపడుతుంటారు. వీటిని చర్మ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. యాంటీజెన్ పరీక్షల ద్వారా అలర్జీలను గుర్తిస్తాం. ఈ పరీక్షల కోసం ఖరీదైన సొల్యూషన్స్తో కూడిన యాంటీజెన్స్ అవసరమవుతాయి. ఈ ద్రావణాల ద్వారా రోగులకు సంబంధించిన వ్యాధిని గుర్తిస్తే చికిత్స చేయడం సులభమవుతుంది. రోగి మాటిమాటికి దవాఖానకు వచ్చే అవసరం లేకుండా వచ్చిన రోజే పరీక్షలు చేయడం, అదే రోజు ఫలితాలు రావడంతో అప్పటికప్పుడే అవసరమైన మందులు ఇస్తాం.